నిజం..నిర్భయం

Friday 12 August 2011

అణగదొక్కబడినవారి కడుపుమంటతో కాలిపోతున్న హైదరాబాద్!


నాడు రవి అస్తమించని సామ్రాజ్యమని జబ్బలు జరుచుకున్న ఆంగ్లేయులు(బ్రిటిష్) దోచుకున్న ఆస్తులకి ఆలవాలమైన లండన్ మహానగరం నేడు అణగదొక్కబడినవారి కడుపుమంటతో గత మూడు రోజులుగా దహించుకుపోతుంది.

ఆజ్యం:

లండన్ ఉత్తరప్రాంతమైన టోటెన్‌హామ్ వీధిలో ఆఫ్రో-కరీబియన్ జాతికి చెందిన నల్లవారు ఎక్కువగా నివసిస్తారు. ఇదే వీధిలో మొన్న శనివారం మార్క్ డగ్గన్ అనే నల్లజాతి యువకుని పోలీసులు అనుమానాస్పదరీతిలో కాల్చిచంపడం. జరిగిన అనాగరిక సంఘటనపై ఇదే ప్రాంతంలోని వివిధ మిశ్రమజాతులు శాంతియుతంగా తలపెట్టిన నిరసన ప్రదర్శన ఆనక హింసాత్మకమై విధ్వంసానికి దారి తీసింది.

అగ్ని:(సాక్షి పత్రిక సౌజన్యంతో)

౧.అభివృద్ధి పేరు మీద సమాజంలో సాగే కార్యకలాపాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడమేకాక వారిని దూరంగా నెట్టేయడం
౨.సమాజానికి ఏం చేశామనేది పోయి ఏమి కొన్నామనే దాన్నిబట్టి మనిషిని అంచనా వేయడం, విలువనివ్వడం. అవి కొనలేని వారిలో నిరాశను ప్రేరేపిస్తున్నాయి.

       నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
       అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని

౩.ఆంగ్లేయ జాతి జాత్యహంకారపు మచ్చలు.
౪.నల్లవారిని, ఇతర అల్పసంఖ్యాక జాతులవారిని వెలి వేసినట్టు నిర్దిష్ట ప్రాంతాలకు పరిమితం చేయడం, వారిపై నిరంతరం పోలీస్ నిఘా ఉంచడం, రోడ్డు మీద వెడుతున్నవారిని ఆపడం, సోదా చేయడం, వేధించడం జరుగుతుంటుంది. డగ్గన్ ని పోలీసులు కాల్చిచంపడం ఇటువంటి వేధింపుల పాశవికపార్శ్వమే తప్ప మరొకటి కాదు.

       పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా
       అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
       వేట అదే వేటు అదే నాటి కథే అంతా
       నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత
       బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
       శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ
 
శరణార్థి శిబిరాలను తలపించే లండన్ వెలివాడలలోని యువత ఇలా ఆగ్రహోదగ్రంగా విరుచుకుపడడానికి దుగ్గన్ కాల్చివేత ఇంధనం అందించి ఉండవచ్చుకానీ, అదొక్కటే కారణం కాదు. దాని మూలాలు బ్రిటన్‌నే కాక, మొత్తం యూరప్‌ను అట్టుడికిస్తున్న ఆర్థికసంక్షోభంలో ఉన్నాయనడం అత్యుక్తి కాదు. గత పాతికేళ్లుగా బ్రిటన్ వృద్ధి స్తంభించిపోయింది. జనాభాలో పదిశాతం ఉన్న సంపన్నులు నూరుశాతం నాణ్యమైన జీవనం సాగిస్తుంటే పేదలు మరింత అడుగంటిపోతున్నారు. సామాజిక ఊర్ధ్వచలనం బ్రిటన్‌లో ఉన్నంత దారుణంగా మరే అభివృద్ధి చెందిన దేశంలోనూ లేదని నిపుణులు అంటున్నారు.

ఉన్నత పాఠశాల విద్యతోనే చదువు మానేసిన యువత సంఖ్య మరే పాశ్చాత్యదేశంలో లేని స్థాయికి బ్రిటన్‌లో పెరిగిపోయి, ఒక తరం మొత్తాన్నే తుడిచిపెట్టింది. బ్రిటన్ యువతలో విద్య, ఉద్యోగం, ఉపాధి శిక్షణ లేనివారు ఏకంగా 17 శాతం ఉన్నారు. దీనికితోడు రుణసంక్షోభంతో యూరప్ మొత్తం గుడ్లు తేలేస్తోంది. దీనినుంచి గట్టెక్కే ప్రయత్నంలో భాగంగా బ్రిటన్ సంక్షేమవ్యయంపై భారీగాకోత పెట్టి, పొదుపుచర్యలు ప్రారంభించడం పేదవర్గాలకు, నిరుద్యోగులకు మరింత ప్రాణాం తకమైంది. విద్యార్థులు, కార్మికులు సహా అన్ని వర్గాలవారూ వీధికెక్కి నిరసన ప్రదర్శనలు జరపడం దాదాపు నిత్యకృత్యమైంది. లండన్ నగరాన్ని అతలా కుతలం చేస్తున్న తాజా అల్లర్లను కూడా ఆ కోణంనుంచే చూడవలసి ఉంటుంది.

తాము ఒళ్లు వంచకుండా, తమ చేతికి మట్టి అంటకుండా చూసుకోవడంతోపాటు, ఖర్చు తగ్గించుకోవడం లక్ష్యంగా తృతీయ ప్రపంచ దేశాల నుంచి లభించే చవక శ్రమపై ఇంతకాలం పాశ్చాత్య సమాజాలు ఆధారపడుతూ వచ్చాయి. జాతుల సహజీవనం, సామరస్యం, ప్రజాస్వామ్యం వంటి అందమైన మాటల ముసుగులో వలసలను ప్రోత్సహించాయి. ఇప్పుడు ఆర్థికసంక్షోభం తమ జీవనభద్రతనే ప్రశ్నార్థకం చేస్తూ, తమ యువతనే నిరుద్యోగ రక్కసి కరకు కోరల్లోకి నెడుతుండడంతో ఒక్కసారిగా పాశ్చాత్యేతరజాతుల ఉనికి కంటగింపుగా మారిపోయింది.

ప్రజాస్వామ్యం, జాతుల సహజీవనం వంటి ముసుగులు తొలగిపోయి స్వార్థం, క్రౌర్యం తాండవించే అసలు ముఖం బయట పడుతోంది. అది నాజీయిజాన్ని తలపించే జాతివివక్షా విషాన్ని పుక్కిలిస్తోంది. మొత్తం మీద పాశ్చాత్యముఖచిత్రంలో రంగులు మారడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రపంచాన్ని కొల్లగొట్టిన సంపద కరిమింగిన వెలగపండుగా మారి, పాశ్చాత్యపు ఓడలు బళ్లవుతున్నాయా? కాలం ఎలాంటి కఠోరసత్యాలను ఆవిష్కరించనుందో?!


శీర్షికలో హైద్రాబాదేల?:  
పైన లండన్లో ఉదహరించిన పరిస్థితులు ఒక మోతాదు ఎక్కువగానే ఆంధ్రలో నెలకొనివున్నాయి. త్వరలో హైదరాబాదు నగరం ఇదేవిధంగా తగలబడకుండా చూసుకోవడమే లండన్ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం. తగలబడిన తరువాత శాంతిమంత్రాలు వల్లెవేస్తే ఉపయోగం ఉండదు. నిజానికి నేడు "శాంతి" అనేది చేవలేని, చేతగాని వాని మాట-బాట ఆయితే, దాన్ని స్వార్ధానికి వాడుకుంటూ తమపై ఈగవాలకుండా చూసుకునే నిర్లజ్జతత్వం అణగదొక్కుతూ అందలమెక్కిన పెట్టుబడిదారులనే కులపెత్తందారులది. దశాబ్దాల తరబడి శాంతి, శాంతి అంటున్న బౌద్దటిబెటన్లకు తమ స్వంతదేశంలోనే స్వేచ్ఛావాయువులు కరువైన పరిస్థితి. అదే శాంతి బౌద్ధం శ్రీలంకలో తమను అణగదొక్కాలనుకున్న పులుల పీచమణిచి నేడు శాంతిని నెలకొల్పి అభివృద్దిపధంలో ముందుకువెళుతున్నారు. సామాన్యుల తెలంగాణ పోరాటానికి ఇది స్పూర్తినివ్వాలి!         

Monday 8 August 2011

అణగదొక్కడంలో అధునాతన పద్దతులు - 1


అది 2020 సంవత్సరం.

అటుపక్క తెలంగాణా రాష్ట్రం ఏర్పడి సుభిక్షంగా ఉంది. ఇటు ప్రత్యేకదేశమనే కులభుజంగాలు బుసలు కొడుతూ చీమలు కష్టపడి పెట్టిన పుట్టలని ఆక్రమించుకుని దానికి భుజంగదేశమని పేరు పెట్టి విషభావాలు చిమ్ముతున్దేవి.  ఇక షరా మామూలుగానే ఆంధ్రదేశం. తాము కులగజ్జితో గోక్కుంటూ ఉండడమే కాక అన్ని కులాలకి ఆ గజ్జి ఉందని  తమ మిధ్యమాలతో రుద్దుతూ పచ్చకామెర్ల సామెతని గుర్తుచేస్తున్న రోజులవి.

అలా ఒకరోజు ఆంధ్రదేశమున అనగా స్వకులనామసంవత్సర కులతిధి కులవారం..

కులాలకతీతంగా హైందవధర్మమే ఆవలంబనగా  ఏర్పడిన ఒక జాతీయభావన సంఘ౦లోని(జా.స) యువసమ్మేళన సమావేశమది. కులం లేదు, హైన్దవులందరూ ఒకటేనని ఆవేశంగా ఉపన్యసిస్తున్నారు నాటి సమావేశపు ముఖ్యఅతిధి మహా'కుల'నాయకుడు(మకునా) గారు. హైందవధర్మానికి నేడు ఇతరమతాల వల్ల ముప్పు ఏర్పడిందని దానికి వ్యతిరేకంగా జా.స యువకులంతా పోరాడాలని  పిలుపునిస్తున్నాడు మకునా.  శ్రద్దగా వింటున్న యువతలో భావోద్వేగాలు రెచ్చిపోతున్నాయి. కొంతమంది యువతలోతమ జీవితాన్ని త్యాగం చేసయినా ఏదో ఒకటి చేసి ధర్మాన్ని రక్షించుకోవాలన్న తపనని బయటికి వ్యక్తపరుస్తున్నారు. వీటిని గమనించిన మకునా మరింత ఉత్సాహంగా అంతే మోతాదులో వాడి వేడి మాటలు వాడి తన ఉపన్యాసాన్ని దంచుతున్నాడు యువత మెదళ్ళమీద.


ఇలా వాడిగా వేడిగా ఉపన్యాసం సాగుతుండగా మకునా వ్యక్తిగత సహాయకుడు(వ్య.స) మకునా చెవిలో ఏదో చెప్పాడు. వ్య.స హావభావాలని బట్టి అదేదో అత్యంత అవసరమైన విషయం అన్నట్లు తెలుస్తుంది. మకునా గారు తన దంచుడు ప్రసంగాన్ని మధ్యలోనే హఠాత్తుగా  ఆపారు. తను అత్యవసరంగా హాజరుకావాల్సిన పని ఉందని మరోసారి పిలుపునిస్తానని చెప్పి వేదికనుంచి హాడావుడిగా దిగిపోయి కారెక్కారు. వేదిక నుంచి కారెక్కేవరకూ వ్య.స ని బండబూతులు తిడుతూనేఉన్నాడని తెలుస్తుంది. ఇహ అప్పటిదాకా "రెచ్చగొట్టుడు" అనే నవనాగారికపు మత్తుపదార్ధాన్ని మెదళ్ళద్వారా సేవిస్తున్న  అక్కడి యువత  తమ భావోద్వేగాలని అడ్డూఅదుపూ లేకుండా స్వారీ చేస్తున్న ప్రసంగం హఠాత్తుగా ఆగిపోవడంతో కించిత్ అసహనానికి లోనైనా  తమ మకునాకి ఏమైందో? అన్న తీవ్రఆందోళన వ్యక్త౦చేస్తున్నారు.    


"నువ్వు అంత అత్యవసర సమావేశం ఉందని ముందు ఎందుకు గుర్తుచేయలేదు?" అని కొత్తగా తనదగ్గర చేరిన వ్య.సని ఏకుతున్నాడు మకునా కారులో.  మీకీ  జాతీయభావన సమావేశం ముఖ్య౦ అనుకున్నాను. కానీ అవతలి సంఘం వాళ్ళు పదేపదే ఫోన్ చేయడంతో మీకు చెప్పక తప్పలేదని వ్య.స సమాధానం ఇస్తున్నాడు.  వ్య.స సమాధానాన్ని వినకుండా నీకు ఏది ముఖ్యమో ఆ మాత్రం తెలియకపొతే ఎట్లా అంటూ  ఏవో బండబూతులు తిడుతున్నాడు మకునా.


కారు సరాసరి ఒక పెద్దభవనం ముందు ఆగింది. అది మకునా యొక్క  స్వకులపు యువ'కుల'సంఘ (యుకుస) సమావేశం. వీరికోసం అక్కడ అప్పటికే పడిగాపులు కాస్తూ వేచివున్న యువ'కుల'నాయకుడు(యుకునా) మకునాకి ఘనస్వాగతం పలికాడు. తన ఆలస్యానికి వ్య.స కారణమని యుకునాకి చెబుతూ, పైకి చెయ్యెత్తి ఊపుతూ  అక్కడి యువకులందరికి ఆశీస్సులు అందజేస్తూ వేదికని అలంకరించాడు. మకునా తమ కులానికి చేసిన గొప్పపనుల గురించి చెబుతూ  యుకునా  స్వాగతోపన్యాసం చేశాడు.  తర్వాత మకునా చేత తమ కుల యువ'కుల'కు ధనసహాయాన్ని అందించాడు. అటుపిమ్మట అందరూ ఉత్కంభరితంగా ఎదురుచూస్తున్న మకునా గారి కులోపన్యాసం మొదలైంది.   సమాజంలో వచ్చే సామాజిక పెనుమార్పులకు తట్టుకుని తమ కులాధిపత్య కూకటివ్రేళ్ళు కుళ్లకుండా  భవిష్యత్తు కార్యాచరణ ఏవిధంగా ఉండాలనే దాని మీద మకునా ఏకబిగిన ఇస్తున్న కులోపన్యాసానికి తన్మయులై  చెవులుకిక్కిరించి మరీ వింటున్నారు భావిభారత యువ'కులం' అని చెప్పుకునేవాళ్ళు.

ఇహ ఇప్పుడు ప్రశ్న-సమాధానం.. సమస్య-పరిష్కార సమయం. మకునా గారు తన కులానుభావన్నంతా రంగరించి భావిభారతాన్ని ఇంకో రెండువేల ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్ళే సమయం.

అత్యంతఉత్సాహంగా గోక్కుంటూ యుకునా లేచాడు ముఖమంతా ప్రశ్నలా పెట్టి. మిగిలిన యువ'కులంతాను' అదే రీతిలో గోక్కుంటూ చప్పట్లు కొడుతూ యుకునాకి ఉత్సాహాన్నిచ్చారు.  యుకునా గొంతు సవరించుకుంటూ తన ప్రశ్న అడగటం మొదలుపెట్టాడు.

మకునా గారు... ఒకనాటి అంధకార ఆంధ్రప్రజలంతా నేడు క్రమంగా 'పచ్చ'కామెర్ల నుంచి బయటపడి సామాజిక వాస్తవాలు, స్థితిగతులు తెలుసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మన కులాధిపత్యాన్ని ధిక్కరిస్తున్నారు. వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కులగజ్జిని విమర్శిస్తున్నారు.  వీరిని ఎలా ఎదుర్కోవాలో మన యువకులానికి అర్ధం కావడం లేదు. మీరు తక్షణ కర్తవ్యబోధ చేయగలరు.

ఇంతలో యువకులగుంపు లోంచి ఒక యువ'కులకిశోరుడు' ఉద్రేకంతో ఊగిపోతూ  " అడ్డంగా వేసేద్దాం  ఆ నా లం.కొ..." అంటూ తన కులాభిమాన కథానాయకుడు పూనినట్లు హావభావాలు ప్రదర్శించి మరీ  చేసిన ధనసహాయానికి కృతజ్ఞత  ప్రకటించుకోవడానికి ఇదే సమయమని రాయలేని బూతులతో రెచ్చిపోతున్నాడు. ఇహ ఇట్టా కాదన్నట్టు యుకునా "ఆ మాత్రం నాకూ తెలుసన్నట్లు" సంజ్ఞ చేసి సదరు కులకిశోరుడి గోక్'ప్రవాహానికి అడ్డుకట్టవేసి  తను కొనసాగాడు.

ఆనాడు మనకుల'గజ్జి వ్యతిరేకులని రాజకీయ సామాజిక(కుల) బలంతోనో లేక  ధనమద రూపేణానో పైకిరాకుండా అణగతొక్కాం..అడ్డు తిరిగినవాడిని వేసేసాం..మనం అందలం ఎక్కాం.  ఆ తొక్కుడు పైకి రాకుండా మిధ్యమాలని వాడుకున్నాం. కానీ ప్రపంచమే కుగ్రామమైన నేటి నెటిరోజుల్లో ఎవరు ఎక్కడ్నించి విమర్శచేస్తున్నారో తెలుసుకోవడమే చాలా కష్టం.   అలాంటిది "వేసేయడం" అస్సలు కుదరడం లేదు. అదే విధంగా నాడు మనచేత అణగదొక్కబడిన వాళ్ళు నేడు వాస్తవాలు తెలుసుకుంటున్నారు... అంతేకాకుండా మన పచ్చకామెర్ల మిధ్యమాలకి నేటి ఆత్మ'సాక్షిలు సవాలు విసురుతున్నాయి.  ఈ పరిస్థితులలో వీటిని ఏవిధంగా ఎదుర్కోవాలో మన యువకులానికి అర్ధం కావడంలేదు. మీరు ఈ విషయమై సందేశం ఇవ్వగలరని ఆశిస్తున్నా అని ముక్తాయించాడు యుకునా.

నేటి సందిగ్ధ పరిస్థితులని ఎలా ఎదుర్కోవాలో తన స్వకుల యువతకి సందేశం ఇవ్వడానికి సిద్దమయ్యాడు మకునా.  "వేసేయడం" సమస్యకి పరిష్కారం కాదు. ఒకవేళ వేస్తూ పొతే ఎంతమందిని వేస్తారు? అన్నట్లు యువతని ప్రశ్నించాడు. మరయితే పరిష్కారం ఏంటి? అన్నట్లు యువత అంతా  ఏంతో ఆసక్తిగా మకునా వైపు చూస్తూ తర్వాత ఏమి చెపుతాడోనని చెవులు కిక్కిరించి మరీ వింటున్నారు. వీరి ఆసక్తిని గమనించిన మకునా ఒక విషపునవ్వు నవ్వి గొంతు సవరించుకుంటూ దానికి పరిష్కారం ఒకటే. అది "వ్యతిరేకులను అణగదొక్కడానికి అధునాతన పద్దతులు వాడడమే! " అని ఆపాడు.


అణగదొక్కడమే అనాగరికమైతే మళ్ళీ అందులో అధునాతన పద్దతులా!.. ఎప్పుడూ వినలేదే అన్నట్లు యువకులంతా ప్రశ్నార్థకంగా మకునా వైపు చూసారు.            

(సశేషం)




బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers