సాపాటు సమగతులు

నిజం..నిర్భయం

Friday 12 August 2011

అణగదొక్కబడినవారి కడుపుమంటతో కాలిపోతున్న హైదరాబాద్!


నాడు రవి అస్తమించని సామ్రాజ్యమని జబ్బలు జరుచుకున్న ఆంగ్లేయులు(బ్రిటిష్) దోచుకున్న ఆస్తులకి ఆలవాలమైన లండన్ మహానగరం నేడు అణగదొక్కబడినవారి కడుపుమంటతో గత మూడు రోజులుగా దహించుకుపోతుంది.

ఆజ్యం:

లండన్ ఉత్తరప్రాంతమైన టోటెన్‌హామ్ వీధిలో ఆఫ్రో-కరీబియన్ జాతికి చెందిన నల్లవారు ఎక్కువగా నివసిస్తారు. ఇదే వీధిలో మొన్న శనివారం మార్క్ డగ్గన్ అనే నల్లజాతి యువకుని పోలీసులు అనుమానాస్పదరీతిలో కాల్చిచంపడం. జరిగిన అనాగరిక సంఘటనపై ఇదే ప్రాంతంలోని వివిధ మిశ్రమజాతులు శాంతియుతంగా తలపెట్టిన నిరసన ప్రదర్శన ఆనక హింసాత్మకమై విధ్వంసానికి దారి తీసింది.

అగ్ని:(సాక్షి పత్రిక సౌజన్యంతో)

౧.అభివృద్ధి పేరు మీద సమాజంలో సాగే కార్యకలాపాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడమేకాక వారిని దూరంగా నెట్టేయడం
౨.సమాజానికి ఏం చేశామనేది పోయి ఏమి కొన్నామనే దాన్నిబట్టి మనిషిని అంచనా వేయడం, విలువనివ్వడం. అవి కొనలేని వారిలో నిరాశను ప్రేరేపిస్తున్నాయి.

       నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
       అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని

౩.ఆంగ్లేయ జాతి జాత్యహంకారపు మచ్చలు.
౪.నల్లవారిని, ఇతర అల్పసంఖ్యాక జాతులవారిని వెలి వేసినట్టు నిర్దిష్ట ప్రాంతాలకు పరిమితం చేయడం, వారిపై నిరంతరం పోలీస్ నిఘా ఉంచడం, రోడ్డు మీద వెడుతున్నవారిని ఆపడం, సోదా చేయడం, వేధించడం జరుగుతుంటుంది. డగ్గన్ ని పోలీసులు కాల్చిచంపడం ఇటువంటి వేధింపుల పాశవికపార్శ్వమే తప్ప మరొకటి కాదు.

       పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా
       అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
       వేట అదే వేటు అదే నాటి కథే అంతా
       నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత
       బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
       శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ
 
శరణార్థి శిబిరాలను తలపించే లండన్ వెలివాడలలోని యువత ఇలా ఆగ్రహోదగ్రంగా విరుచుకుపడడానికి దుగ్గన్ కాల్చివేత ఇంధనం అందించి ఉండవచ్చుకానీ, అదొక్కటే కారణం కాదు. దాని మూలాలు బ్రిటన్‌నే కాక, మొత్తం యూరప్‌ను అట్టుడికిస్తున్న ఆర్థికసంక్షోభంలో ఉన్నాయనడం అత్యుక్తి కాదు. గత పాతికేళ్లుగా బ్రిటన్ వృద్ధి స్తంభించిపోయింది. జనాభాలో పదిశాతం ఉన్న సంపన్నులు నూరుశాతం నాణ్యమైన జీవనం సాగిస్తుంటే పేదలు మరింత అడుగంటిపోతున్నారు. సామాజిక ఊర్ధ్వచలనం బ్రిటన్‌లో ఉన్నంత దారుణంగా మరే అభివృద్ధి చెందిన దేశంలోనూ లేదని నిపుణులు అంటున్నారు.

ఉన్నత పాఠశాల విద్యతోనే చదువు మానేసిన యువత సంఖ్య మరే పాశ్చాత్యదేశంలో లేని స్థాయికి బ్రిటన్‌లో పెరిగిపోయి, ఒక తరం మొత్తాన్నే తుడిచిపెట్టింది. బ్రిటన్ యువతలో విద్య, ఉద్యోగం, ఉపాధి శిక్షణ లేనివారు ఏకంగా 17 శాతం ఉన్నారు. దీనికితోడు రుణసంక్షోభంతో యూరప్ మొత్తం గుడ్లు తేలేస్తోంది. దీనినుంచి గట్టెక్కే ప్రయత్నంలో భాగంగా బ్రిటన్ సంక్షేమవ్యయంపై భారీగాకోత పెట్టి, పొదుపుచర్యలు ప్రారంభించడం పేదవర్గాలకు, నిరుద్యోగులకు మరింత ప్రాణాం తకమైంది. విద్యార్థులు, కార్మికులు సహా అన్ని వర్గాలవారూ వీధికెక్కి నిరసన ప్రదర్శనలు జరపడం దాదాపు నిత్యకృత్యమైంది. లండన్ నగరాన్ని అతలా కుతలం చేస్తున్న తాజా అల్లర్లను కూడా ఆ కోణంనుంచే చూడవలసి ఉంటుంది.

తాము ఒళ్లు వంచకుండా, తమ చేతికి మట్టి అంటకుండా చూసుకోవడంతోపాటు, ఖర్చు తగ్గించుకోవడం లక్ష్యంగా తృతీయ ప్రపంచ దేశాల నుంచి లభించే చవక శ్రమపై ఇంతకాలం పాశ్చాత్య సమాజాలు ఆధారపడుతూ వచ్చాయి. జాతుల సహజీవనం, సామరస్యం, ప్రజాస్వామ్యం వంటి అందమైన మాటల ముసుగులో వలసలను ప్రోత్సహించాయి. ఇప్పుడు ఆర్థికసంక్షోభం తమ జీవనభద్రతనే ప్రశ్నార్థకం చేస్తూ, తమ యువతనే నిరుద్యోగ రక్కసి కరకు కోరల్లోకి నెడుతుండడంతో ఒక్కసారిగా పాశ్చాత్యేతరజాతుల ఉనికి కంటగింపుగా మారిపోయింది.

ప్రజాస్వామ్యం, జాతుల సహజీవనం వంటి ముసుగులు తొలగిపోయి స్వార్థం, క్రౌర్యం తాండవించే అసలు ముఖం బయట పడుతోంది. అది నాజీయిజాన్ని తలపించే జాతివివక్షా విషాన్ని పుక్కిలిస్తోంది. మొత్తం మీద పాశ్చాత్యముఖచిత్రంలో రంగులు మారడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రపంచాన్ని కొల్లగొట్టిన సంపద కరిమింగిన వెలగపండుగా మారి, పాశ్చాత్యపు ఓడలు బళ్లవుతున్నాయా? కాలం ఎలాంటి కఠోరసత్యాలను ఆవిష్కరించనుందో?!


శీర్షికలో హైద్రాబాదేల?:  
పైన లండన్లో ఉదహరించిన పరిస్థితులు ఒక మోతాదు ఎక్కువగానే ఆంధ్రలో నెలకొనివున్నాయి. త్వరలో హైదరాబాదు నగరం ఇదేవిధంగా తగలబడకుండా చూసుకోవడమే లండన్ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం. తగలబడిన తరువాత శాంతిమంత్రాలు వల్లెవేస్తే ఉపయోగం ఉండదు. నిజానికి నేడు "శాంతి" అనేది చేవలేని, చేతగాని వాని మాట-బాట ఆయితే, దాన్ని స్వార్ధానికి వాడుకుంటూ తమపై ఈగవాలకుండా చూసుకునే నిర్లజ్జతత్వం అణగదొక్కుతూ అందలమెక్కిన పెట్టుబడిదారులనే కులపెత్తందారులది. దశాబ్దాల తరబడి శాంతి, శాంతి అంటున్న బౌద్దటిబెటన్లకు తమ స్వంతదేశంలోనే స్వేచ్ఛావాయువులు కరువైన పరిస్థితి. అదే శాంతి బౌద్ధం శ్రీలంకలో తమను అణగదొక్కాలనుకున్న పులుల పీచమణిచి నేడు శాంతిని నెలకొల్పి అభివృద్దిపధంలో ముందుకువెళుతున్నారు. సామాన్యుల తెలంగాణ పోరాటానికి ఇది స్పూర్తినివ్వాలి!         

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers